కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, విజయవంతం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండగా, పనులను వేగవంతం చేయాలని అధికారులను యంత్రాంగం ఆదేశించింది. సభా ప్రాంగణ ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy), జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇతర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సభ విజయవంతం కావడానికి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు.
ముఖ్యంగా సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయి ఏర్పాట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సభ రోజు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు, భారీ వాహనాల పార్కింగ్ స్థలాల కేటాయింపు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణంలో నిరంతర తాగునీటి సరఫరా, విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యేలా అధికార యంత్రాంగం, పార్టీ శ్రేణులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. సీఎం సభ ఖరారు కావడంతో నల్లగొండ జిల్లా రాజకీయంగా ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. మంత్రి (Minister Komatireddy) ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై, మైదానంలో పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది.
Read Also: చినుకు రాలదు.. మొలక మొలవదు..!
Follow Us On: Instagram

