కలం, వెబ్ డెస్క్ : పాలకులకు కనీస మానవత్వం లేకపోవడం వల్లే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శించారు. శనివారం మీట్ ది ప్రెస్ లో ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల కోసం లక్ష సూపర్న్యూమరీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. పరిపాలనలో మదర్లీ టచ్ అవసరమని తాను అంటే కొందరు వ్యంగ్యంగా మాట్లాడారని, కానీ ప్రజలకు అమ్మలా తోడుంటాననే తన మాటపై కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
దళిత, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం తీరును కవిత ఎండగట్టారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన 33 వేల కోట్లలో కేవలం 14 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. గిరిజన సబ్ ప్లాన్ నిధుల్లోనూ భారీగా కోత విధించి 9 వేల కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. దీనివల్ల విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సైతం ఎస్సీ, ఎస్టీ తరహాలోనే ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని కవిత (Kavitha) ధ్వజమెత్తారు. ఎంబీసీ సహా వివిధ కుల కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా బీసీలను వంచిస్తున్నారని విమర్శించారు. మైనారిటీలకు బడ్జెట్లో నిధులు చూపిస్తున్నా ఆచరణలో ఖర్చు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.

