కలం, మెదక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) పేర్కొన్నారు. సత్యం, ధర్మం గెలిచిందని.. ఇది బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రైతాంగానికి దక్కిన నైతిక విజయమని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం రాజకీయ కక్షసాధింపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ వ్యాఖ్యలు చెల్లవని కోర్టు తేల్చిచెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టుని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి సాగించిన విచారణ కేవలం రాజకీయ డ్రామా అని స్పష్టమైందన్నారు. హైకోర్టు తీర్పు తర్వాతైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరవాలని సూచించారు. ఇకనైనా ఈ కక్షసాధింపులు, రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి.. వెంటనే ఆ పిల్లర్లకు మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలని ఎమ్మెల్యే చింతా (Chinta Prabhakar) డిమాండ్ చేశారు.

