కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh)పై మరో కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్(Nara Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్పై కేసు నమోదు చేశారు. ఆదివారం జోగి రమేష్ ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ నారా లోకేష్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెళ్లి జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పు అంటించి గొడవ చేశారు. ఆదివారం రాత్రి జోగి రమేష్ స్వయంగా ఇంటికి వెళ్లి ఇల్లు ధ్వంసమైన తీరును పరిశీలించారు. జోగి రమేష్పై కేసు నమోదు చేస్తున్నారని, ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని సమాచారం అందడంతో ప్రస్తుతం జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. కాగా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవల జనవరి 24న జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


