కలం, వెబ్ డెస్క్: కర్నూలు నర్సింగ్ కాలేజీలో చదువుతున్న కశ్మీర్ విద్యార్థినుల మీద (Kashmir Students) వేధింపులపై జమ్మూ అండ్ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (జేకేఎస్ఏ) తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసింది.
ఈ కాలేజీలో కొన్నాళ్లుగా కశ్మీరీ విద్యార్థినులపై మతం, ప్రాంతం, వస్త్రధారణ పరంగా వేధింపులు జరుగుతున్నాయని ఆ లేఖలో జేకేఎస్ఏ పేర్కొంది. ఇటీవల రంజాన్ మాసంలో ఇవి మరింత తీవ్రమైనట్లు తమ దృష్టికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది. రంజాన్ నెలలో ప్రత్యేక ఏర్పాట్లకు కాలేజీ సిబ్బంది నిరాకరించడం, హిజాబ్ ధరించవద్దని ఒత్తిడి చేయడం, తిట్లతో మానసిక హింసకు గురిచేస్తున్నట్లు తెలిసిందని పేర్కొంది.
‘దాదాపు రెండు డజన్ల మంది కశ్మీరీ విద్యార్థినులు(Kashmir Students) ఈ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. వీళ్లలో ఎక్కువ మంది ప్రధానమంత్రి స్పెషల్ స్కాలర్షిప్ కింద చేరినవాళ్లే. అయితే, వీళ్లంతా కాలేజీలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మతం, ప్రాంతం, వస్త్రధారణ కారణంగా వివక్షకు, అవమానాలకు గురవుతున్నారు. రంజాన్ మాసంలో ఇవి మరింత తీవ్రరూపం దాల్చాయి. వీటిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలి. కారకులపై చర్యలు తీసుకోవాలి. కశ్మీర్ విద్యార్థినులకు అండగా నిలవాలి’ అని ఆ లేఖలో జేకేఎస్ఏ కోరింది.

