కలం, కరీంనగర్ బ్యూరో: తూకం లేక కల్లాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వీటిని చూసి మేం రోడ్డెక్కితే రాజకీయం అంటారు… మాకు సమస్య పరిష్కారం కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy) పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం జీవన్ రెడ్డి మార్కెట్ను నాయకులతో కలిసి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మార్కెట్లో 40 వేల క్వింటాళ్ల మొక్కజొన్న ఉండగా, తూకం వేసిన 20 వేల సంచులు లారీలు లేక రవాణా కావడం లేదని, దీంతో కల్లాల్లో ధాన్యం నిలిచిపోయిందని రైతులు జీవన్ రెడ్డికి విన్నవించారు.
దీనిపై స్పందించిన జీవన్ రెడ్డి కలెక్టర్, మార్కుఫెడ్ ఎండి , మార్కుఫెడ్ డీఎం లతో ఫోన్లో మాట్లాడారు. “రోజుకు 4 లారీలు వస్తేనే తూకం అవుతుందని, జిల్లా మార్కుఫెడ్ అధికారులు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. జగిత్యాలలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ గోదాములు ఖాళీగా ఉన్నా వినియోగించడం లేదని, మార్కెట్ గోదాములను కాంట్రాక్టర్ తన అవసరాలకు వాడుకుంటున్నాడని జీవన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై మార్కుఫెడ్ ఎండీ స్పందిస్తూ లారీలు వచ్చేలా చూస్తామని, మేజ్ పరిమితి పెంచుతామని హామీ ఇచ్చారు. గోదాముల కేటాయింపు, రవాణా సమస్య తీవ్రంగా ఉందని అధికారులు అంగీకరించి, తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీవన్ రెడ్డి వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, రాయికల్ మున్సిపల్ చైర్మన్ రవి, యువజన నాయకుడు తాటిపర్తి చంద్ర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

