కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కుంటున్నానని.. కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నదని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై ఆలోచిస్తున్నానని ఆయన వెల్లడించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జగిత్యాలలో జరిగిన సమావేశంలో మాట్లాడిన జీవన్ రెడ్డి, పార్టీ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో తనకు ఎదురవుతున్న అవమానాలు ఎంతకాలం భరించాలనే ప్రశ్న తనను వేధిస్తున్నదన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు భవిష్యత్ ఏంటో స్పష్టంగా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్తో (MLA Sanjay Kumar) తనకు రాజకీయ వేధింపులు తప్పవని జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలను పక్కనబెట్టి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “జగిత్యాల కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారా?” అంటూ ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇక స్పీకర్ ఎమ్మెల్యే పార్టీ మారలేదని చెబుతున్నప్పటికీ, ఆయన రాజకీయ వ్యవహారాలు మాత్రం కాంగ్రెస్తో సాగుతున్నాయంటూ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పార్టీ అధిష్టానం స్థానిక కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. జగిత్యాలలో ఇలాంటి పరిస్థితులు ఉంటే, పార్టీ మారినట్లు ఆరోపణలు ఉన్న మరో తొమ్మిది ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అధిష్టానం పరిశీలించాలన్నారు. ఈ అంశంపై స్పష్టత తీసుకురాకపోతే కార్యకర్తల్లో గందరగోళం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అంటూ ఆయన కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. జీవన్ రెడ్డి మీద కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: హాట్ టాపిక్: కుర్చీకోసం కుమ్మక్కు రాజకీయాలు
Follow Us On : WhatsApp


