కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చేపట్టనున్న జనగణన (Census)కు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో సెన్సస్ ప్రక్రియ జరగనున్నందున ఐఏఎస్ అధికారుల స్థాయిలో అవగాహనా సదస్సు జరిగింది. రాష్ట్రంలో జరిగే ఈ ప్రక్రియకు సెన్సస్ డిపార్టుమెంటు తరఫున రాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ భారతి హోళికెరి (Bharati Holikeri) డైరెక్టర్గా నియమితులయ్యారు. సెన్సస్ ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతి, కల్పించాల్సిన అవగాహన, సిబ్బందికి శిక్షణ తదితరాలపై ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సచివాలయంలో సోమవారం సమావేశంలో చర్చ జరిగింది. సింగిల్ ఫేజ్లో ఏప్రిల్ 1 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాలు, గూడేలు, తండాలు, చిన్నచిన్న ఆవాసాల్లో అన్ని ఇళ్లను లెక్కించే (House listing) ప్రక్రియ ప్రారంభం కానున్నది. సుమారు 90 వేల మంది సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు.
సమన్వయం, సకాలంలో నిర్ణయం
సెన్సస్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించడంపై అన్ని డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ రివ్యూ నిర్వహించారు. ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకూడదని, ప్రతీ ఇంటిని టచ్ చేసి నిర్దిష్ట ప్రొఫార్మా ప్రకారం అన్ని ప్రశ్నలకు కుటుంబ సభ్యుల నుంచి సమాధానాలను నమోదు చేయాలని సూచించారు. అనేక డిపార్టుమెంట్లు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నందున మెరుగైన సమన్వయంతో పాటు సకాలంలో నిర్ణయాలు తీసుకునే మెకానిజం అమలు కావాలని నొక్కిచెప్పారు. ఏయే డిపార్టుమెంటు నుంచి ఎంత మంది సిబ్బందిని ఈ ప్రక్రియకు కేటాయించగలరో వివరాలను సేకరించి వీలైనంత తొందరగా అందజేయాలని సూచించారు. డిజిటల్ పద్ధతిలో జరిగే ప్రక్రియ కావడంతో సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా కల్పించాల్సి ఉంటుందని సెన్సస్ డైరెక్టర్ భారతి హొళికెరి (Bharati Holikeri) తెలిపారు.
Read Also: హాట్ టాపిక్: కుర్చీకోసం కుమ్మక్కు రాజకీయాలు
Follow Us On: Instagram


