కలం, వెబ్ డెస్క్ : జపాన్ (Japan) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని హొక్కాయిడో ప్రీఫెక్షర్ లోని టొకాచీ రీజియన్ లో సోమవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం సుమారు 80 కి.మీ లోతులో నమోదైనట్లు భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. భూకంప తీవ్రత వల్ల కొన్ని చోట్ల భవనాలు బీటలు వారాయి. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు.
కాగా, వారం రోజుల క్రితమే జపాన్లో ఏకంగా 7.7 తీవ్రతతో ఒక అతిపెద్ద భూకంపం సంభవించి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ తీవ్ర పరిణామం తరువాత, ఈశాన్య తీరప్రాంతంలో భవిష్యత్తులో మరో భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా 6.2 తీవ్రతతో ప్రకంపనలు రావడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దీనివల్ల ఏమైనా సునామీలు సంభవించే అవకాశం ఉందా? అని స్థానికులు భయపడిపోతున్నారు. అయితే తాజా భూకంపం కారణంగా ఎలాంటి సునామీ వచ్చే అవకాశం లేదని, ఎలాంటి అడ్వైజరీ జారీ చేయలేదని జపాన్ జాతీయ వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది.

