కలం, జనగామ : భక్తికి హద్దులు లేవని, కళకు పరిధులు ఉండవని జనగామ (Jangaon) జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రంగోలి ఆర్టిస్ట్ పెద్ది కుసుమ నాగరాజు మరోసారి నిరూపించారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె ఒక సాధారణ తమలపాకుపై శ్రీరామ చంద్రుని రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
ప్రకృతియే కాన్వాస్..
సాధారణంగా రంగులతో ముగ్గులు వేసే కుసుమ నాగరాజు, ఈసారి ప్రకృతి సిద్ధమైన తమలపాకును తన కాన్వాస్గా ఎంచుకున్నారు. ఆకుపై ఉన్న ఈనెలు దెబ్బతినకుండా, అత్యంత సూక్ష్మంగా రాముని రూపాన్ని చిత్రించడం విశేషం. “ప్రకృతియే దైవం.. ఆ దైవమే ప్రకృతి” అనే సందేశాన్ని చాటుతూ, హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుపై స్వామి రూపాన్ని ఆవిష్కరించారు.
నెటిజన్ల ప్రశంసలు..
ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “జై శ్రీరామ్” అంటూ భక్తులు వారి కళా నైపుణ్యాన్ని కొనియాడుతున్నారు. గతంలో కూడా పలు సామాజిక అంశాలు పండుగల సందర్భాల్లో కుసుమ నాగరాజు తన రంగోలి కళతో జిల్లా (Jangaon) వ్యాప్తంగా అనేక ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు

