కలం, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే (Janasena MLA) అరవ శ్రీధర్ వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ యూపీఎస్సీ అభ్యర్థిగా నటించి ఎమ్మెల్యేను హనీట్రాప్లో పడేసిందని, నకిలీ హాల్ టికెట్ను తయారుచేసి, పరీక్ష షార్ట్లిస్ట్లో పేర్లను మార్చి దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళ ఎమ్మెల్యేతో అక్రమ సంబంధాలు పెట్టుకుని, తర్వాత బ్లాక్మెయిల్ చేసేందుకు ఈ వ్యూహం అమలుచేసినట్లు కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఫోర్జరీ ఆరోపణలు నిజమైతే ఆ మహిళపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. భారత శిక్షాస్మృతి (IPC)లోని తీవ్రమైన సెక్షన్లు వర్తిస్తాయి. సెక్షన్ 465 – ఫోర్జరీ (2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా)సెక్షన్ 468 (7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా), సెక్షన్ 420 – (7 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా) విధించే అవకాశాలున్నాయి.
కాగా మరో కేసులో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైన నేపథ్యంలో మహిళ పరారైంది. ఆమెను అరెస్టు చేయడానికి పోలీసులు సెర్చ్ వారంట్ జారీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో మరిన్ని వివరాలు, ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జనసేన పార్టీ అధిష్ఠానం సైతం స్పందించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి.


