కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఫోకస్ చేశారా? వచ్చే ఎన్నికల లక్ష్యంగా ఆయన ఓటుబ్యాంకును పెంచుకోబోతున్నారా.. అంటే అవుననే చెప్పక తప్పదు. ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో జనసేన (Janasena) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పోటీ చేసింది. గెలుపు ఓటములు పక్కన పెడితే.. తాము కూడా రేసులో ఉన్నామని ఆ పార్టీ పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఇదే ఊపుతో పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు (Membership Drive) కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు, జిల్లాల వారీగా, గ్రేటర్ పరిధిలోని కార్పొరేషన్లకు ప్రత్యేక ఇన్చార్జిలను ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షులు బొంగనూరి మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు రాధారం రాజలింగం, కావ్య మండపాక, శిరీష పొన్నూరు పర్యవేక్షించనున్నారు.
ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు మొత్తం 13 మంది ముఖ్య నాయకులకు వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ (మహబూబ్నగర్, సైబరాబాద్), మాదిరెడ్డి దామోదర్ రెడ్డి (వరంగల్, హైదరాబాద్), మేకల సతీష్ రెడ్డి (భువనగిరి, నల్గొండ)తో పాటు మరికొందరు నాయకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో సభ్యత్వ నమోదును వేగవంతం చేయనున్నారు.


