కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి (Rajouri) జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన శోధన నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ భారీ ఆపరేషన్ మంగళవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. దట్టమైన అడవులు, నిటారుగా ఉండే కొండలు, దారి దొరకని కఠినమైన భూభాగంలో భద్రతా దళాలు తమ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను మరింత ఉధృతం చేశాయి. ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతం చుట్టూ గట్టి నిఘా ఉంచిన సైన్యం, ప్రతి కదలికను నిశితంగా గమనిస్తోంది.
అడవుల్లో నక్కిన ఉగ్రవాదులను కనిపెట్టి, వారిని మట్టుబెట్టేందుకు త్రివిధ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా ఉండేందుకు అటవీ ప్రాంతమంతటా అదనపు బలగాలను మోహరించారు. నిరంతర నిఘాతో పాటు భద్రతా వలయాన్ని మరింత పటిష్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

