కలం, వెబ్డెస్క్: జగిత్యాల (Jagtial) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వృద్ధురాలి మృతదేహం చెవికి ఉన్న బంగారు కమ్మలు మాయమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు మృతురాలి చెవికి బంగారు లేకపోవడాన్ని గమనించారు. దీంతో వారు ఆసుపత్రికి వెళ్లి నిర్వాహకులను, సిబ్బందిని నిలదీశారు. అయితే వారు తమకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆసుపత్రి సిబ్బందే మృతురాలి బంగారు కమ్మలు దొంగిలించారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

