కలం, కరీంనగర్ బ్యూరో: తమ భూమిని వేరొకరి పేరుతో నమోదు చేశారని ఆరోపిస్తూ దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య (Suicide)కు యత్నించారు. ఈ ఘటన జగిత్యాల (Jagtial) జిల్లా మోతె గ్రామపంచాయతీ ఆఫీసులో శుక్రవారం జరిగింది. ఓలుగొత్తుల రాజేశ్, శిరీష దంపతుల కుటుంబానికి 25 గుంటల వ్యవసాయ భూమితో పాటు ప్రభుత్వ స్థలం ఉంది. బాబాయ్ ఓలుగొత్తుల చిన్న పోచయ్య, అతని కుమారుడు రాజ్ కుమార్ అక్రమంగా భూ మార్పిడి చేయించుకున్నారని ఆరోపించారు. తమ తండ్రి ఓలుగొత్తుల నడిపి పోచయ్య 2022లో మృతిచెందిన తర్వాత పంచాయతీ రికార్డుల్లో పేరు మార్పిడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీ సిబ్బంది లంచాలకు ఆశపడి భూమిని భూ మార్పిడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై న్యాయం కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. విసుగు చెందిన దంపతులు గ్రామపంచాయతీ ఆఫీస్కు చేరుకుని, పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అక్కడున్నవారు అప్రమత్తమై వెంటనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ కళ్లలో పడటంతో దంపతులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వెంటనే ఆ దంపతులను ఆస్పత్రికి తరలించారు.
Read Also: చివరి దశకు ఆపరేషన్ కగార్: నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అర్బన్ నక్సల్స్!!
Follow Us On: Instagram

