కలం, కరీంనగర్ బ్యూరో: రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు కరీంనగర్ (Karimnagar) జిల్లాలో మ్యూల్ అకౌంట్లను ఆపరేట్ చేయడం కలకలం రేపుతోంది. కరీంనగర్ లోని నాలుగు ప్రధాన బ్యాంకుల్లో సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న 34 మ్యూల్ అకౌంట్లను సైబర్ సెక్యూరిటీ వింగ్ పోలీసులు గుర్తించారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’లో భాగంగా అనుమానాస్పద ఖాతాలపై నిఘా పెట్టింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఖాతాదారుల్లో చిరువ్యాపారులు, పనీపాట లేకుండా తిరిగే యువకులే ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి అకౌంట్లను వాడుతూ సైబర్ నేరగాళ్లు ఒక్కో లావాదేవీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ ఇస్తూ వాడుకుంటున్నారు. ఈ అకౌంట్ల (Bank Accounts) ద్వారా సుమారు వెయ్యికి పైగా అక్రమ లావాదేవీలు జరపగా, వాటిలో రూ.3 కోట్ల మేర జమ అయినట్లు గుర్తించారు. వేర్వేరు ఘటనలకు సంబంధించి పోలీసులు 20 కేసులు నమోదు చేశారు. ఖాతాదారులతోపాటు వారికి మీడియేటర్లుగా వ్యవహరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు సూత్రదారులను పట్టుకునే పనిలోపడ్డారు.
Read Also: చివరి దశకు ఆపరేషన్ కగార్: నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అర్బన్ నక్సల్స్!!
Follow Us On: Facebook

