కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అధిష్టానం వద్ద ఆసక్తికర ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల కోసం సీనియర్ నేత వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ పేర్లను ఆయన ప్రధానంగా పరిశీలించాలని కోరారు. ఈ విషయంలో ఇప్పటికే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ లతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను (Mallikarjun Kharge) కలిసేందుకు ఢిల్లీ వచ్చిన జగ్గారెడ్డి, రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ వల్ల బిజీగా ఉండటంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి తన విన్నపాన్ని వివరించారు. కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్, స్టూడెంట్ లీడర్ గా పనిచేశారని, వారి కుటుంబం స్వాతంత్ర్య సమరయోధుల నేపథ్యం కలిగి ఉండటమే కాకుండా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోందని గుర్తుచేశారు.
సీనియర్ నాయకులు వి. హనుమంతరావు తెలంగాణలో అనేకమంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారని, గతంలో మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ హయాంలో ఆయనకు అనేక అవకాశాలు దక్కాయని, వయసు పైబడినప్పటికీ ఆయన ఇప్పటికీ ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారని వివరించారు. అందుకే వీహెచ్ కు మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదనలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే, ఈ అంశాన్ని కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధిష్టానం, రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయం మేరకే తాము ముందుకు వెళ్తామని జగ్గారెడ్డి (Jaggareddy) ఈ సందర్భంగా తెలిపారు.
Read Also : జమ్ముకశ్మీర్ అంశం.. పాక్ కామెంట్స్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
Follow Us On: Instagram

