కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ (Iran) తో శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం పాకిస్తాన్కు చేరుకుంది.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం లోని బృందం పాకిస్తాన్ చేరుకోగా.. శనివారం ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే చర్చలు ప్రారంభం కావడానికి కొద్ది క్షణాల ముందు ఇరాన్ దేశం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తమ రెండు షరతులు నెరవేరే వరకు ఇరాన్ చర్చలకు దిగదని ఆ దేశ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ తేల్చి చెప్పారు.
లెబనాన్ లో కాల్పుల విరమణ జరగాలని మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ అన్నారు. రెండవది, ఇరాన్ నిరోధిత ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలపై ఇప్పటికే ఇరుపక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరినా, అవి ఇంకా అమలు కాలేదని వెల్లడించారు. ఈ రెండు షరతులను నెరవెర్చకుండా చర్చలు ప్రారంభం కావని స్పష్టం చేశారు.
అమెరికా, ఇరాన్ చర్చల సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ లో రెండు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం రాకపై సస్పెన్స్ నెలకొంది. శనివారం శాంతి చర్చలు జరగనుండగా ఇరాన్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ అంశంపై వైట్ హౌజ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

