కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ అమెరికా, మిత్రదేశాల లక్ష్యాలపై ఇరాన్ (Iran) విరుచుకుపడింది. సోమవారం కువైట్ సరిహద్దుల్లో మూడు అమెరికా (America) యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా విమానాలు కూలిన విషయాన్ని ధృవీకరించింది. మరోవైపు, సౌదీ అరేబియాలోని కీలక ఇంధన వనరులే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలలో ఒకటైన రస్ తనూరపై డ్రోన్ అటాక్ జరగడంతో, సౌదీ ఆరామ్కో ఆ రిఫైనరీని తాత్కాలికంగా షట్డౌన్ చేసింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 10శాతం పెరిగాయి. వీటితో పాటు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని రస్ అల్ ఖైమా ప్రాంతంలో కూడా ఇరాన్ డ్రోన్లతో దాడి చేయగా, అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. డ్రోన్ శకలాలు అల్ హమ్రా గ్రామంలో పడటంతో స్వల్ప నష్టం వాటిల్లింది.

