క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ వాయిదా?

కలం, వెబ్ డెస్క్​ : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నా, షెడ్యూల్ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. మార్చి 28 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత, కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా షెడ్యూల్ ప్రకటనలో జాప్యం జరుగుతోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం పడటంతో హోటళ్లు, రవాణా రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జట్లు బస చేసే హోటళ్లలో గ్యాస్ కొరత ఏర్పడితే నిర్వహణ కష్టమవుతుందని బీసీసీఐ (BCCI) భావిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిస్థితులపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ, ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. పరిస్థితులను బట్టి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి టోర్నీ వాయిదాపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదని స్పష్టం చేశారు. మరోవైపు, బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకుని భద్రతా పరమైన ఇబ్బందులు లేకుండా షెడ్యూల్‌ను రూపొందించాల్సి ఉంది. అందుకే మార్చి 12 లేదా 13వ తేదీల్లో మొదటి 20 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గ్యాస్ కొరత తీవ్రమైతే గతంలో కోవిడ్ సమయంలో చేసినట్లుగా టోర్నీని కొన్ని నగరాలకే పరిమితం చేయడం లేదా వేదికలను మార్చడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా బోర్డు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుండగా, అభిమానులు మాత్రం పూర్తి షెడ్యూల్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, చమురు సంస్థలు గ్యాస్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్న తరుణంలో, ఐపీఎల్ నిర్వహణపై త్వరలోనే సానుకూల వార్త వస్తుందని ఆశిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>