కలం, వెబ్డెస్క్: ఐపీఎల్ (IPL)కు భారత్ గ్రౌండ్లు ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు అదిరిపోయే వార్త ఒకటొచ్చింది. మొన్నటి వరకు ఆర్సీబీ హోంగ్రౌండ్లో మ్యాచ్లు జరుగుతాయా? లేదా? అన్న సందిగ్దత నుంచి మ్యాచ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ 2026 (IPL) సీజన్ ఫైనల్కు కూడా ఈ స్టేడియమే వేదిక కానుంది. గత ఏడాది విషాద ఘటన తర్వాత మూతపడిన ఈ స్టేడియంలో మళ్ళీ క్రికెట్ సందడి మొదలుకాబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి సంతోష్ మీనన్ పలు కీలక విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సీజన్లో మొత్తం ఏడు మ్యాచ్లు బెంగళూరులో జరగనున్నాయి. ఇందులో ఆర్సీబీ ఆడే ఐదు హోమ్ మ్యాచ్లతో పాటు, ఒక ప్లే-ఆఫ్, అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్ కూడా ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్, ప్రారంభ వేడుకల తేదీలను బీసీసీఐ ప్రకటించనుంది. అయితే, ఆర్సీబీ తన మిగిలిన రెండు హోమ్ మ్యాచ్లను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ స్టేడియంలో ఆడనుంది.
ఇదిలా ఉంటే గతేడాది టైటిల్ సెలబ్రేషన్స్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో, 2025 జూన్ నుండి చిన్నస్వామి స్టేడియంపై నిషేధం విధించారు. ఇప్పుడు భద్రతా పరమైన చర్యలు పూర్తి చేసి, మళ్ళీ మైదానాన్ని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ కర్ణాటక ప్రభుత్వం, పోలీస్ శాఖ, కేఎస్సీఏకు ధన్యవాదాలు తెలిపింది. చిన్నస్వామి స్టేడియం తమ జట్టు గుర్తింపు అని, అభిమానుల శక్తి తమ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ పేర్కొన్నారు.
తమ అభిమానుల కోసం హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ బృందం డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తమ సొంత మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి కావడంతో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

