కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) లో ప్రస్తుతం పొగ వివాదం తీవ్రస్థాయిలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. పంజాబ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. దీంతో ఇది తీవ్ర వివాదంగా మారింది. అయితే, క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు కూడా మైదానంలోనో, డ్రెస్సింగ్ రూమ్లోనో పొగ తాగుతూ కెమెరాలకు చిక్కారు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఇ-సిగరెట్ వాడుతూ కనిపించారు. లైవ్ టీవీలో ఈ దృశ్యాలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. భారత్లో వేపింగ్ నిషేధం కావడంతో దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గతంలో దొరికిపోయిన స్టార్లు:
ఆరోన్ ఫించ్: 2020 ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడుతున్నప్పుడు ఫించ్ డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఆ వీడియో అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది.
ఏబీ డివిలియర్స్: దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఈ ఏడాది జరిగిన ఎస్ఏ20 లీగ్లో విఐపి స్టాండ్స్లో వేపింగ్ చేస్తూ కనిపించారు. బిగ్ స్క్రీన్పై తనని చూసుకున్న ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
బెన్ స్టోక్స్: 2019 వరల్డ్ కప్ ఫైనల్ వంటి ఉత్కంఠభరిత సమయంలో ఒత్తిడి తట్టుకోలేక స్టోక్స్ లార్డ్స్ స్టేడియం టాయిలెట్లో సిగరెట్ తాగినట్లు తర్వాత బయటపడింది.
బ్రెండన్ మెకల్లమ్: 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధించే సమయంలో మెకల్లమ్ డ్రెస్సింగ్ రూమ్ వెనుక భాగంలో సిగరెట్ తాగుతూ గడిపినట్లు తన పుస్తకంలో రాసుకున్నారు.
కగిసో రబడ: ఈ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ రబడ కూడా హోటల్ బాల్కనీలో సిగరెట్ తాగుతూ కనిపించడం చర్చకు దారితీసింది.
శిక్షలు ఎలా ఉండొచ్చంటే..
క్రికెట్ స్టేడియాలు, ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్లు ‘నో స్మోకింగ్’ జోన్లు. వీటిలో పొగ తాగడం ఐసీసీ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం నేరం.
కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు: డ్రెస్సింగ్ రూమ్లో పొగ తాగడం లేదా వేపింగ్ చేయడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనిపై పరాగ్కు భారీ జరిమానా లేదా అధికారిక హెచ్చరిక ఇచ్చే అవకాశం ఉంది.
చట్టపరమైన చిక్కులు: భారత్లో ఇ-సిగరెట్లు (Vapes) వాడటం చట్టరీత్యా నేరం. 2019 చట్టం ప్రకారం తొలిసారి ఇలాంటి తప్పు చేస్తే ఏడాది వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా పడే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తే పరాగ్ మరింత ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ ఫోన్ వాడినందుకు రూ. లక్ష జరిమానా విధించారు. అదే పద్ధతిలో పరాగ్పై కూడా చర్యలు ఉండవచ్చని సమాచారం.

