కలం, వెబ్ డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia)లోని అల్ ఖర్జ్ ప్రావిన్స్లో జనావాస ప్రాంతాల్లో పేలుళ్లు కలకలం రేపాయి. తాజాగా పేలుళ్లు జరిగిన ఘటనపై సౌదీ పౌర రక్షణ శాఖ వివరాలను వెల్లడించింది. ఈ దురదృష్టకర ఘటనలో ఇద్దరు బంగ్లాదేశీయులు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది బంగ్లాదేశీయులు గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో ఒక భారతీయ పౌరుడు కూడా గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. మరణించిన వారిలో భారతీయులు ఎవరూ లేకపోవడం ఊరట కలిగించే విషయమని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే రియాద్లోని భారత రాయబార కార్యాలయం సౌదీ అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఎంబసీ కౌన్సెలర్ వై.సాబిర్ స్వయంగా అల్ ఖర్జ్ చేరుకొని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడిని పరామర్శించారు. ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎంబసీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

