కలం, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్పై తీవ్రస్థాయిలో పడింది. కేవలం ఒక్క రోజులోనే ముడి చమురు ధరలు ఏకంగా 16 శాతం మేర పెరగడం గమనార్హం. దీనితో నాలుగేళ్ల విరామం తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర వంద డాలర్ల మార్కును దాటేసింది. గడిచిన వారం రోజుల్లోనే ధరలు సుమారు 33 డాలర్లకు పైగా పెరిగి ప్రస్తుతం 109.14 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడం, ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 డాలర్ల స్థాయి నుంచి ఒక్కసారిగా 109.14 డాలర్లకు ధరలు ఎగబాకడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

