కలం, వెబ్డెస్క్: అండర్–19 వన్డే వరల్డ్ కప్ (U19 World Cup) మొదటి మ్యాచ్లో యువ భారత్ తడబడినా బోణీ కొట్టింది. జింబాబ్వేలోని బులవాయో వేదికగా గురువారం యూఎస్ఎతో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 35.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్ సుధిని(36; 52 బంతుల్లో 4 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 5 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. దీపేశ్ దేవేంద్రన్, ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ తీశారు.
ఛేదనలో వర్షం కారణంగా లక్ష్యాన్ని డీఎల్ఎస్ పద్ధతిలో 37 ఓవర్లకు 96 పరుగులుగా నిర్ణయించారు. స్వల్ప లక్ష్యం చేరుకోవడంలో యువ భారత్ తడబడింది. సూపర్ ఫామ్లోఉన్న చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ 2 పరుగులకే వెనుదిరిగాడు. వేదాంత్ త్రివేది (2), కెప్టెన్ ఆయుష్ మాత్రె (19), విహాన్ మల్హోత్రా(18) సైతం ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఒక దశలో యువ భారత్ 29/3తో నిలిచింది. అయితే, కనిష్క్ చౌహాన్(10నాటౌట్) తోడుగా అభిజ్ఞాన్ కుందు(42నాటౌట్; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును మరో 20 ఓవర్లు ఉండగానే గెలిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో రిత్విక్ అప్పిడి 2 వికెట్లు, రిషబ్ షంపి, ఉత్కర్ష్ శ్రీవాత్సవ చెరో వికెట్ తీశారు. హెనిల్ పటేల్కు ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.

Read Also: విద్యార్థుల ఆత్మహత్యలు.. విద్యాసంస్థలకు సుప్రీం కీలక ఆదేశం
Follow Us On: X(Twitter)


