కలం, వెబ్డెస్క్: దక్షిణాఫ్రికాపై భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ (Womens Hockey World Cup)లో 6-1తో భారీ విజయం సాధించింది. అమ్స్టెల్వీన్లోని వాగెనర్ స్టేడియంలో జరిగిన పూల్-డీ మ్యాచ్లో ఆది నుంచే భారత్ ఆధిపత్యం చూపించింది. ఈ గెలుపుతో భారత్ పూల్-డీలో అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. తొలి క్వార్టర్లో సునెలిత గోల్ చేసి భారత్కు శుభారంభం అందించింది. ఆ తర్వాత నవనీత్ డ్రాగ్-ఫ్లిక్తో మరో గోల్ చేసింది. దీంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో సుశీలా చాను గోల్ చేసింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 3-0తో ముందంజలో ఉంది.
రెండు క్వార్టర్లలోనూ భారత్ వరుస దాడులతో సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచింది. మూడో క్వార్టర్లో భారత్ మరింత దూకుడు పెంచింది. బల్జీత్, నవనీత్ కలిసి చేసిన మంచి కదలిక తర్వాత దీపిక గోల్ చేసింది. రెండు నిమిషాలకే లాల్రెమ్సియామి రివర్స్-స్టిక్ షాట్తో మరో గోల్ చేసింది. దీంతో భారత్ 5-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సాక్షి, ఇషికా కూడా మరో గోల్ కోసం ప్రయత్నించారు. సౌతాఫ్రికా కొన్ని అవకాశాలు సృష్టించినా.. భారత గోల్కీపర్ బిచు మణి అడ్డుకుంది. పెనాల్టీ కార్నర్లోనూ అద్భుత సేవ్ చేసింది.
మూడో క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 6-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరి క్వార్టర్లో సౌతాఫ్రికా గోల్ కోసం ప్రయత్నించింది. కైలా డి వాల్ ఒక గోల్ చేసి ఆధిక్యాన్ని 6-1కి తగ్గించింది. అయితే అప్పటికే మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరికి 6-1తో విజయం సాధించిన భారత్ పూల్-డీలో టాప్ స్థానానికి చేరుకుంది. తదుపరి ఇంగ్లండ్తో మ్యాచ్ భారత్కు కీలకంగా మారింది.

