కలం, వెబ్ డెస్క్ : వరుస భూకంపాలు వెనెజువెలాలో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. వెనెజువెలా ఉత్తర ప్రాంతంలో ఒకే నిమిషం వ్యవధిలో రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇప్పటివరకు 235 మందికి పైగా మృతి చెందారు. ఇంకా వేలాది మంది కుప్పకూలిన శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వెనెజువెలాకు భారత్ అండగా నిలిచింది. వెనెజువెలా బాధితులకు అత్యవసర సాయం అందించేందుకు ‘ఆపరేషన్ అమిస్తాద్’ (Operation Amistad) ను ప్రారంభించింది.
‘ఆపరేషన్ అమిస్తాద్’ ( స్పానిష్లో అమిస్తాద్ అంటే స్నేహం)తో చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా భారత్ రెండు సీ – 17 గ్లోబ్ మాస్టర్ విమానాలను వెనెజువెలాకు పంపించింది. ఈ విమానాల్లో వైద్య సామగ్రి, 35 టన్నులకు పైగా నిత్యావసరాలను తరలించింది. అత్యవసర వైద్యం, శస్త్ర చికిత్సలు, ఇతర ఆరోగ్య సేవలు అందించేందుకు 41 మందితో కూడిన వైద్య బృందాన్ని ఇందులో తీసుకెళ్లారు. విపత్తుల సమయంలో తాత్కాలిక ఆసుపత్రులుగా ఉపయోగపడే ఆధునిక వైద్య యూనిట్లు అయిన రెండు భీష్మ క్యూబ్లను కూడా పంపించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలా ప్రజలకు భారత్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

