కలం, వెబ్ డెస్క్ : చమురు నిల్వలు (Crude Oil Reserves), ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ముడిచమురు, పెట్రోలియం నిల్వలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖండించింది. ప్రస్తుతం భారతదేశం వద్ద దాదాపు 250 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురుతో పాటు రిఫైన్డ్ పెట్రోలియం నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిల్వలు దేశం మొత్తానికి సుమారు 7 నుంచి 8 వారాల పాటు నిరంతరాయంగా సరిపోతాయని అధికారిక నివేదిక వెల్లడించింది.
కేవలం 25 రోజులకు మాత్రమే సరిపోయే నిల్వలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం ఈ సందర్భంగా తేల్చిచెప్పింది. మంగళూరు, పడూర్, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఉన్న వ్యూహాత్మక నిల్వ కేంద్రాలతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పైప్లైన్లు, నౌకల్లో ఈ భారీ చమురు నిల్వలను (Crude Oil Reserves) భద్రపరిచినట్లు కేంద్రం వివరించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ఆ భారం ప్రజలపై మోపమని కేంద్రం ప్రకటించింది. దేశంలో ఇంధన ధరలు పెంచబోమని కేంద్రం తెలిపింది. ఆ భారం ఆయిల్ కంపెనీలే భరించాలని పేర్కొన్నది.

