కలం, స్పోర్ట్స్: చెకియాలో జరగనున్న ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ ఉస్టీ నాడ్ లాబెమ్ టోర్నీకి భారత బాక్సింగ్ జట్టును (India Boxing Team) ప్రకటించారు. ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గొహైన్, ఆసియా చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత ప్రీతి పవార్ జట్టుకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జూన్ 17 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీకి 12 మంది సభ్యులతో భారత బాక్సింగ్ ఫెడరేషన్ జట్టును ఎంపిక చేసింది. గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ సన్నాహకాల్లో భాగంగా ఈ పోటీలు కీలకంగా మారాయి.
భారత జట్టులో (India Boxing Team) కామన్వెల్త్ గేమ్స్ బరువు విభాగాలకు చెందిన పలువురు అగ్రశ్రేణి బాక్సర్లు చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యర్థులతో పోటీ పడే అవకాశం ఈ టోర్నీ ద్వారా లభించనుంది. ఐదు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఈ టోర్నీ యూరోప్లో అత్యంత ప్రతిష్టాత్మక బాక్సింగ్ ఈవెంట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 10 బరువు కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయి.
భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి బాక్సర్లతో పోటీ పడేందుకు ఇది మంచి వేదిక అని తెలిపారు. ఇలాంటి టోర్నీలు ఆటగాళ్లకు అనుభవం, ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునే అవకాశం కల్పిస్తాయని చెప్పారు.
మహిళల జట్టులో సాక్షి (51 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియా (60 కేజీలు), పర్వీన్ (65 కేజీలు), లవ్లీనా బోర్గొహైన్ (75 కేజీలు) చోటు దక్కించుకున్నారు.
పురుషుల జట్టులో జాదుమణి సింగ్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), ఆదిత్య ప్రతాప్ (65 కేజీలు), సుమిత్ (70 కేజీలు), అంకుష్ (80 కేజీలు), కపిల్ పొఖారియా (90 కేజీలు), నరేందర్ (+90 కేజీలు) ఎంపికయ్యారు. అయితే ప్రపంచ నంబర్ వన్ జైస్మిన్ లాంబోరియా, అరుంధతి చౌదరి గాయాల నుంచి కోలుకుంటున్న కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉండనున్నారు. రాబోయే ప్రధాన అంతర్జాతీయ పోటీలకు ముందు భారత బాక్సర్లకు ఈ టోర్నీ కీలక పరీక్షగా మారనుంది.

