కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరో భారీ ముందడుగు వేసింది. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో అత్యాధునిక వసతులతో కూడిన కార్గో టెర్మినల్ 2 (Cargo Terminal 2) ప్రారంభమైంది. ఈ కొత్త సౌకర్యంతో ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్గా భాగ్యనగరం తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
మొత్తం 16,864 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ టెర్మినల్ లో 11,673 చదరపు మీటర్ల బిల్ట్-అప్ ఏరియాను కేటాయించారు. ఏడాదికి 50,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో ప్రారంభమైన ఈ కేంద్రం, భవిష్యత్తులో లక్ష మెట్రిక్ టన్నుల వరకు విస్తరించేలా డిజైన్ చేయడం విశేషం. అంతర్జాతీయ కార్గో కోసం ప్రత్యేకమైన దిగుమతి, ఎగుమతి జోన్లు ఇక్కడ ఏర్పాటయ్యాయి. దేశీయ కార్గో రవాణా సులువుగా సాగేందుకు ప్రత్యేక ఇన్బౌండ్, అవుట్బౌండ్ జోన్లను సైతం సిద్ధం చేశారు.
ఫార్మా, టెక్నాలజీ రంగానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ టెర్మినల్లో మల్టీ-లెవల్ రాకింగ్ సిస్టమ్ నిర్మించారు. త్వరగా పాడైపోయే వస్తువులు, ఔషధాల రక్షణ కోసం ఉష్ణోగ్రత నియంత్రిత ఫార్మా జోన్ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ సరికొత్త మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ వాణిజ్యంలో హైదరాబాద్కు సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, గ్లోబల్ కనెక్టివిటీ పవర్హౌస్గా మార్చబోతున్నాయి.
Read Also: ఎబోలా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
Follow Us On: WhatsApp

