కలం, వెబ్ డెస్క్ : అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల దేశంలో ఎల్పీజీ వంటగ్యాస్ సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు అందుతాయా? లేదా? అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్లు అందకపోతే ఎలా? అని ఆలోచనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు ఆన్ లైన్ లో కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. జనాల బ్యాంక్ ఖాతాలు నిల్ అయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు.
దీంతో హైదరాబాద్ నగర గ్యాస్ వినియోగదారులకు సీపీ సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు. గ్యాస్ కనెక్షన్ KYC అప్ డేట్ (Fake LPG KYC) పేరుతో ఏపీకే ఫైల్స్ ను వినియోగదారులకు సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలిపారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ ఏపీకే ఫైల్స్ ను పంపిస్తున్నారని.. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకసారి ఈ ఏపీకే ఫైల్స్ ఇన్ స్టల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. కాబట్టి గుర్తు తెలియని లింక్స్ ను క్లిక్ చేసి మోసపోవద్దని అంటున్నారు.

