కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడుతున్న ఇబ్బందులతో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel)పై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్కు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న పుకార్లతో బంకుల ముందు జనం క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ నిల్వలపై దేశ పౌరులకు పలు సూచనలు చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్ లెట్లలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రజలు ఎవరూ నిల్వ చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఇంధనం సరఫరా చేసే సమయంలో భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమిళనాడులోని ఒక రిటైల్ స్టేషన్లో పెట్రోల్ను లూస్ కంటైనర్లో తీసుకెళ్తున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చినట్లు వెల్లడించింది. ఇది చాలా ప్రమాదకరమని పేర్కొంది. సంబంధిత పెట్రోల్ బంక్ను సస్పెండ్ చేసినట్లు కేంద్రం తెలిపింది.

