కలం, వెబ్ డెస్క్ : పొరుగు దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా (North Korea) మరోమారు క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోయింది. జపాన్ సముద్రం లక్ష్యంగా ఉత్తర కొరియా ఏకకాలంలో పది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు జపాన్ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఉత్తర కొరియా (North Korea) ప్రయోగించిన ఈ క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపల పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనపై జపాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. క్షిపణి ప్రయోగాలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, ఇది ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తుందని జపాన్ ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దక్షిణ కొరియా, అమెరికా రక్షణ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ క్షిపణుల సామర్థ్యం, అవి ప్రయాణించిన దూరాన్ని విశ్లేషించే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు.

