కలం, వెబ్ డెస్క్ : బహిరంగ రూడ్లపై ప్రమాదాలు జరిగే విధంగా స్టంట్లు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఆరుగురు యువకులను అత్తాపూర్ (Attapur), ఆరాంఘర్ (Aramghar) పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అత్తాపూర్ – ఆరాంఘర్ మధ్య ఉన్న ప్రధాన రహదారిపై కొందరు యువకులు మితిమీరిన వేగంతో బైకులు నడుపుతూ స్టంట్లు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అత్తాపూర్ పరిధిలో దాడులు నిర్వహించారు.
హసన్ నగర్ కు చెందిన సయ్యద్ షాహెద్ (19), షేక్ నసీర్ హుస్సేన్ (19), షేక్ జునైద్ (18), కాలాపత్తర్ నివాసులు అయిన మొహమ్మద్ బిన్ ఇసా (17), అబ్దుల్ సమద్ (20), ఎన్టీఆర్ నగర్ నివాసి మొహమ్మద్ అర్భాజ్ (22) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొహమ్మద్ అర్భాజ్ పై గతంలో పోక్సో కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ నిర్వహించిన డీసీపీ వైభవ్ గైక్వాడ్, రాజేంద్రనగర్, అత్తాపూర్ పోలీసు బృందాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ అభినందించారు.
Read Also: పెళ్లి ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి!
Follow Us On: WhatsApp

