కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్లో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. ప్రయాణికులు ఫిర్యాదు మేరకు మెట్రో అధికారులు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకొని జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి మెట్రో రైలులో సీటు మీద అసభ్యంగా కూర్చొని తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా కూర్చున్నాడు. సరిగ్గా కూర్చోవాలంటూ సూచించినా వినకుండా వారితో వాగ్వాదానికి దిగాడు.
ప్రయాణికుల ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టిన మెట్రో అధికారులు సంబంధిత వ్యక్తి ప్రవర్తన మెట్రో నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. అతడికి రూ.250 జరిమానా విధించారు. ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు హెచ్చరించారు.

