కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వాడుకుని ఒక వ్యక్తి భారీ దోపిడీకి పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పరిధిలోని గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంస్థకు దుండిగల్ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు కావాలని తెలుసుకున్న పురిమెట్ల బంగారు యాదవ్ అనే నిందితుడు రంగంలోకి దిగాడు. ఆ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్ను కలిసిన నిందితుడు తనకు అధికార వర్గాలతో ఉన్నత స్థాయి సంబంధాలు ఉన్నట్లు నమ్మబలికాడు. సదరు ప్రాజెక్టును ఖచ్చితంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చి బాధితుడి నుండి విడతల వారీగా రూ. 1.70 కోట్ల నగదును వసూలు చేశాడు.
డబ్బుతో పాటు ఒక ఖరీదైన ఐఫోన్, అల్కజర్ కారును కూడా తన వశం చేసుకున్నాడు. ఈ వ్యవహారం జరిగి సుమారు 18 నెలలు గడుస్తున్నా పనిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితుడు చివరకు తాను మోసపోయానని గ్రహించాడు. జరిగిన దారుణంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు.

