కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం, దోమల బెడద కారణంగా నగరంలో ఫీవర్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ లాంటి ప్రభుత్వ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారుతుండటంతో ఆసుపత్రుల ఓపీ వార్డులు రోగులతో నిండిపోతున్నాయి.
కేవలం ఆసుపత్రులకే పరిమితం కాకుండా, చాలామంది ఇళ్లలోనే దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్ బారినపడినవారు కోలుకోవడానికి కనీసం వారంరోజులపాటు పడుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
లక్షణాలివే..
అధిక జ్వరం: శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండటం, తరచుగా జ్వరం బాధించడం
శరీర నొప్పులు: కీళ్ల నొప్పులు, కండరాలలో బలహీనతగా అనిపించడం
తలనొప్పి: గంటల తరబడి తలనొప్పి బాధించడం
అలసట: ఏ పని చేయలేనంతగా విపరీతమైన అలసటగా ఉండటం
ఆకలి మందగించడం: జ్వరం కారణంగా తినాలనే ఆసక్తి తగ్గడం

