కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో ప్రస్తుతం గోల్డ్ మ్యాన్ల (Hyderabad Gold Man) వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అసలు వీళ్ల దగ్గర ఇంత బంగారం ఎక్కడిది? ఐటీ కడుతున్నారా? కొనుగోలు చేసిన బంగారానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా? వీళ్లకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నది? అన్న అంశాలపై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ఇటీవల అత్తాపూర్కు చెందిన సూర్య యాదవ్ అనే గోల్డ్ మ్యాన్ వద్ద ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అతని దగ్గర ఉన్నది బంగారం కాదని అధికారులు తేల్చారు.
శుక్రవారం మరో “గోల్డ్ మాన్” (Hyderabad Gold Man) యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద దాదాపుగా రూ. కోటి విలువైన బంగారం ఉన్నట్టు గుర్తించారు. అతని వద్ద ఉన్న మొత్తం 900 గ్రాముల బంగారంలో 700 గ్రాముల బంగారం అన్అకౌంటెడ్గా తేలింది. దీంతో ఐటీ అధికారులు ఆ గోల్డ్ సీజ్ చేసుకున్నారు. వ్యక్తిగత వినియోగం కోసం సుమారు 150–200 గ్రాములను తిరిగి ఇచ్చారు.
ఈ ఆభరణాలకు సంబంధించిన ఆదాయ వనరులపై చిన్న పహిల్వాన్ సరైన వివరణ ఇవ్వలేకపోయాడని సమాచారం. కాగా కొత్తగా అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం-2025లోని సెక్షన్ 247 కింద జారీ చేసిన తొలి వారెంట్ ఇదేనని తెలుస్తోంది. ఇంతకుముందు అక్రమ బంగారం నిల్వలకు సంబంధించి 1961 చట్టంలోని సెక్షన్ 132 కింద చర్యలు తీసుకొనేవారు.
టీవీ, యూట్యూబ్లో చిన్న పహిల్వాన్ తరుచూ ఇంటర్వూలు ఇస్తుంటాడు. హైదరాబాద్ లో జరిగే ఉత్సవాలు, పండగల సమయంలో అతడు బాగా హైలైట్ అయ్యాడు. యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఫేమస్ అయ్యాడు.
చిన్న పహిల్వాన్ ఆ బంగారం అన్అకౌంటెడ్ అని అంగీకరించినట్లు సమాచారం. దాని విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని, ఇండ్ల అద్దెలు, భూవ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించినట్టు చెప్పినప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలు చూపించలేదని సమాచారం.
ఆదాయపు పన్ను రికార్డుల ప్రకారం, అతను దాఖలు చేసిన ఒకే ఒక రిటర్న్లో సుమారు ₹4 లక్షల ఆదాయం మాత్రమే చూపినట్లు అధికారులు తెలిపారు. భూములు కొనుగోలు చేసి, అధిక ధరకు అమ్ముతూ నగదు తీసుకొనేవాడని.. ఆ నగదుకు సంబంధించి స్టాంప్ డ్యూటీ చెల్లించలేదని ఐటీ అధికారులు గుర్తించారు. కుటుంబసభ్యుల ఆర్థిక లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకరు విదేశాల్లో టెకీగా పనిచేస్తుండగా, మరొకరు గర్ల్స్ పీజీ హాస్టల్ ద్వారా ఆదాయం పొందుతున్నట్లు సమాచారం.
Read Also: ఇంటర్నెట్ షట్ డౌన్ !
Follow Us On : WhatsApp

