కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో సంభవించిన అగ్నిప్రమాదంలో (Hyderabad FSL Fire) లో కీలక మలుపు చోటు చేసుకున్నది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన నాగ్పూర్ ప్రత్యేక బృందం తాజాగా ఒక నివేదికను సిద్ధం చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 1100 ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయని, దీనివల్ల అనేక కీలక కేసుల సమాచారం కాలిబూడిదైందని అధికారులు ధృవీకరించారు.
దగ్ధమైన ఈ 1100 కేసులకు సంబంధించిన డేటాను తిరిగి రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందం తీవ్రంగా ప్రయత్నించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమాచారాన్ని సేకరించాలని చూసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఈ కేసుల డేటా రికవరీ చేయడం దాదాపు అసాధ్యమని ప్రత్యేక బృందం తేల్చి చెప్పింది.
కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు, పత్రాలు మంటల్లో కలిసిపోవడంతో ఇప్పుడు ఆయా కేసుల దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. డేటా రికవరీ కష్టమని తేలడంతో అధికారులు తదుపరి చర్యల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.


