కలం, మెదక్ బ్యూరో: హైదరాబాద్ శివారులోని పటాన్చెరు, అమీన్ పూర్ ,అర్.సి పూర్ , తెల్లపూర్ ప్రాంతాల్లో భవన నిర్మాణలు (Hyderabad Construction) స్తంభించి పోయాయి. ఒకవైపు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారించాలని సెంట్రింగ్ కార్మికులు సమ్మెకు దిగడం, మరో వైపు నిర్మాణంకు అత్యంత కీలకమైన ఇసుక లారీల కొరతతో నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణాలను సరైన సమయమైన ఎండకాలంలో అనుకొని సమస్యలతో నిర్మాణాలు నిలిచిపొవడంతో భవన నిర్మాణదారులు అందోళన చెందుతున్నారు.
16 నుంచి కొనసాగుతున్న సమ్మె
తమ సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు సమ్మె బాట పట్టడంతో భవన నిర్మాణ రంగం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ నెల 16 తేది నుండి నగరవ్యాప్తంగా పనులన్నింటినీ నిలిపివేసి, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
సమ్మెలో భాగంగా ఇల్లు కట్టే మెస్త్రీ ప్రమేయం లేకుండా నిర్మాణదారుడు నేరుగా తమకే డబ్బులు ఇవ్వాలని , కాంట్రాక్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా లేబర్ కార్డు కలిగిన ప్రతి సెంట్రింగ్ కార్మికుడికి ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే రూ. 20 లక్షల ప్రమాద బీమా , క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్మికుడికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తూ ఈఎస్ఐ (ESI) కార్డులను జారీ చేయాలన్నారు. సొంత ఇల్లు లేని పేద కార్మికులందరికీ ప్రభుత్వం తరపున గృహ వసతి కల్పించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగిస్తామని చెబుతుండటంతో దాదాపుగా రెండు వారలుగా సెంట్రింగ్ పనులు జరగడం లేదు.
అందుబాటులో లేని ఇసుక
తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కోనుగోలు చేయడానికి లారీల అవసరం ఉన్న నేపథ్యంలో ఇసుక రీచ్ ల నుండి లారీ ద్వారా ఇసుక రవాణా చేసే లారీలు భారీగా తగ్గిపోయాయి. మార్కెట్ లో నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఇసుక రాని పరిస్ధితి ఏర్పడింది. వచ్చిన ఒకటో రెండో లారీలకు సైతం పెద్దఎత్తున డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కు తగిన సప్లై లేకపొవడంతో మార్కెట్ లో ఇసుక రేట్లు కూడా పెరిగాయి. వివిధ రకాల ఇసుకను టన్నుకు దాదాపు 300 నుండి 400 వరకు రేట్లను పెంచి అమ్ముతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ధాన్యం కోనుగోళ్ల కోసం లారీలను భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరో ఇరవై రోజులపాటు ఇసుక దొరకడం కష్టంగా ఉన్నది.
నిలిచిన వేలాది నిర్మాణాలు
హైదరాబాద్ శివారులో ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్ పూర్ ,తెల్లపూర్ , అర్. సి.పూర్ సహ రింగు రోడ్డుకు అనుకోని ఉన్న పలు మున్సిపాలిటిలలో సమ్మె ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. గత రెండు వారాలుగా సెంట్రింగ్ కాంట్రాక్టర్లు ,కార్మికులు తమ పనులు బంద్ చేయడంతో వేలాది నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సెంట్రీ అసోషియేషన్ లో సభ్యులుగా లేనివారిని సైతం అనివార్యంగా పనులు చేయనియడం లేదు, ఎక్కడైన సెంట్రీ పనులు చేస్తే పెద్దఎత్తున జరిమానాలు వేస్తున్నారు స్థానిక సెంట్రింగ్ యూనియన్ వాళ్లు. ఇలా ప్రతికార్మికుడిని సమ్మెలో భాగస్వాములను చేస్తున్నార. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అందోళనలు చేస్తున్నారు. మరో వైపు పది ,పదిహేను రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రీచ్ వద్ద నుండి ఇసుక రవాణా చేయడం కష్టంగా మారుతుంది. దీంతో ఇసుక రేట్లు పెరిగి భవన నిర్మాణదారులు ,వినియోగదారుల పై ఆర్థిక భారం పడనుంది. నిర్మాణాలకు మంచి సమయమైన ఎండకాలంలో కీలకమైన సెంట్రింగ్ సమ్మె, ఇసుక రవాణా లేకపొవడంతో నిర్ణీత గడుపు లో నిర్మాణాలు జరగక, తమకు భారంగా మారే పరిస్ధితి ఉందని సొంతగా ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వారు ,కాంట్రాక్టర్లు , బిల్డర్లు అందోళన చెందుతున్నారు.

