కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూమ్లో జరిగిన భారీ దోపిడీ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్లోని ఓ జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఐదుగురు సాయుధ దుండగులు, తుపాకులతో భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ దుండగులు అందినకాడికి బంగారాన్ని దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
నిందితులు తప్పించుకోకుండా అధికారులు వెంటనే జిల్లా సరిహద్దులను దిగ్బంధించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి పోలీసులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రయాణికులు పోలీసుల తనిఖీలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

