కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వడ్లు కొనకుండా రైతుల ఉసురు పోసుకుంటున్న డూప్లికేట్ రైతుబిడ్డ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. సిద్దిపేట కరీంనగర్ రాజీవ్ రహదారి మల్లారం వద్ద ఆదివారం ధాన్యం కొనుగోలు ( Paddy Procurement) చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ధర్నా నిర్వహించారు. రైతులకు సంఘీభావంగా రైతులతో కలసి ధర్నాలో పాల్గొని ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనడం లేదని ఫైర్ అయ్యారు. గత 28 రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. మొక్కజొన్న రైతులకు గన్నీ బ్యాగులు లేకపోతే రైతులు సొంతంగా బ్యాగులు తెచ్చుకుంటున్నారని అన్నారు. 22 రోజులుగా సన్ ఫ్లవర్ గింజలను కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలెక్టర్లకు ఆర్డర్ ఇచ్చి వడ్ల కొనుగోలును ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వడ్లకు కాంగ్రెస్ నేతలు బోనస్ ఇస్తామని చెప్పి.. బోనస్ బోగస్ చేశారని ఆరోపించారు. ఎరువులు కొనాలంటే యాప్ కావాలి.. వడ్లు కొనాలంటే ఆన్లైన్ కావాలి అంటూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని దుయ్యబట్టారు.

