కలం, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా మందాకిని నది ఉగ్రరూపంతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని చిత్రకూట్ (Chitrakoot) ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన రామ్ఘాట్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నది తీవ్రతకు రామ్ఘాట్ ప్రాంతంలోని 400కు పైగా దుకాణాలు, పలు ఇళ్లు, హోటళ్లు, దేవాలయాలు, మఠాలు వరద నీటిలో మునిగిపోయాయి. నది ఉధృతికి మందాకినిపై ఉన్న సుమారు 300 మీటర్ల పొడవైన వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయ రహదారి (NH 35), సత్నా-చిత్రకూట్ మార్గాల్లో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వరద నీరు రైల్వే ట్రాక్లను ముంచెత్తడంతో 24 ప్యాసింజర్ రైళ్లు, 20 గూడ్స్ రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది.
ఈ పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగకుండా పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి. నదీ తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

