కలం, వెబ్డెస్క్: కొద్ది రోజుల కిందటి వరకు ఎండలతో సతమతమైన ముంబై (Mumbai) వాసులు ఇప్పుడు భారీ వర్షాలు (Heavy Rains), తీవ్ర వరదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ముంబైలోని రోడ్లు, రైల్వే లైన్లు జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు చోట్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ముంబై మహానగర పరిధిలో కేవలం 24 గంటల వ్యవధిలోనే రెండు వేర్వేర్వు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
సౌత్ ముంబైలోని వాకేశ్వర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై పురాతన భవనం మూడో అంతస్తు బాల్కనీ భాగం ఒక్కసారిగా కూలిపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నవీ ముంబైలోని కామోతేలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో బెడ్రూమ్ సీలింగ్ స్లాబ్ ఊడిపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఆయన కుమార్తె తీవ్రంగా గాయపడింది.
మరోవైపు వాతావరణ శాఖ జూలై 5 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు రోడ్లపై వరద నీటిలో వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

