కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలి వాన ధాటికి పలు ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, అంతర్గత రోడ్లపై పెద్ద ఎత్తున చెట్లు, వాటి కొమ్మలు విరిగిపడ్డాయి. కలెక్టరేట్ రోడ్డుతో పాటు పలు దారుల్లో స్మార్ట్ సిటీ వీధి దీపాల స్తంభాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల అధికారులు, సిబ్బంది, కార్మికులు రంగంలోకి దిగి నగర వ్యాప్తంగా వాటి తొలగింపు చర్యలు చేపట్టారు.
మేయర్, కమిషనర్ పర్యటన..
నగరంలో పరిస్థితిని సమీక్షించేందుకు మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సుడిగాలి పర్యటన చేశారు. వారి పర్యవేక్షణలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను, కొమ్మలను కార్మికులు మోటార్ సారంపాల సహాయంతో ముక్కలుగా నరికి తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులతో మున్సిపల్ యంత్రాంగం నిరంతరం సమన్వయం చేసుకుంటూ… వీధి దీపాల ఇనుప స్తంభాలను సరి చేశారు. విరిగిపడిన కరెంట్ పోల్స్ తొలగించారు. నగరపాలక సంస్థ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి రోడ్లను శుభ్రం చేస్తున్నారని మేయర్, కమిషనర్ తెలిపారు.

