కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో ఎండల తీవ్రత (Heatwave) రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా సుమారు 10 మంది మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతులలో వృద్ధులతో పాటు యువకులు కూడా ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన వంశీ కృష్ణ (33) వడదెబ్బ తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. భద్రాచలం పట్టణానికి చెందిన మాటూరి సావిత్రి అనే వృద్ధురాలు, వెంకన్న (42) కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. అలాగే చుంచుపల్లి మండలం రుద్రంపూర్కు చెందిన రజినీకాంత్ (36) కూడా ఎండల తీవ్రతకు బలయ్యారు.
మరోవైపు ఖమ్మం జిల్లాలోనూ వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. ఖమ్మం పాత బస్టాండ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వడదెబ్బతో మృతి చెందగా, కూసుమంచి మండలం గట్టు సింగారానికి చెందిన సాయి చరణ్ (35), రామన్నపేటకు చెందిన గురజాల ఏడుకొండలు కూడా ఎండల తీవ్రతకు కన్నుమూశారు. ఈ ఘటనల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వృద్ధులు మాత్రమే కాకుండా యువకులు కూడా ప్రభావితమవుతున్నారని, వడగాలుల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

