కలం, వెబ్ డెస్క్ : హర్యానా (Haryana)లోని హాన్సి నగరంలో తెల్లవారుజామున ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక జిమ్ వెలుపల తన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న దీపక్ (25) అనే యువకుడిని బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు.
ఉదయం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థులు వ్యాయామం చేస్తుండగా ఈ దాడి జరిగింది. దుండగులు దీపక్పై కనీసం పది రౌండ్ల పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన దీపక్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అతడు చికిత్స పొందుతూ మరణించాడు.
మృతుడు దీపక్ కొంతకాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాహమే అతడి హత్యకు దారితీసిందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

