కలం, వెబ్ డెస్క్ : హర్యానాలోని యమునానగర్ సమీపంలో ఉన్న హత్నికుండ్ బ్యారేజ్ వద్ద సైనిక శిక్షణ నిర్వహస్తుండగా ప్రమాదం (Haryana Army Accident) చోటుచేసుకుంది. నదిలో మోటార్ బోట్ ద్వారా శిక్షణ పొందుతున్న సమయంలో ఆ బోట్ బలమైన నీటి ప్రవాహానికి గురై కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బోటులోని నలుగురు జవాన్లు నీటిలో పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు కమాండోలు సురక్షితంగా ఈత కొడుతూ బయటపడగా, నీటి ప్రవాహంలో మిగిలిన ఇద్దరు కమాండోలు గల్లంతయ్యారు.
గల్లంతైన జవాన్ల కోసం ఘటనా స్థలంలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత సైన్యంతో పాటు హర్యానా, పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆకాశ మార్గం ద్వారా గాలింపు చేపట్టేందుకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF) హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. యమునానగర్ పరిసర ప్రాంతాలతో పాటు దిగువన ఉన్న కాలువల సమీపంలో గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

