కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పాకిస్థాన్ (Pakistan) ఓటమి చవిచూసింది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన అద్భుత సెంచరీతో సులువుగా ఛేదించారు. కేవలం 51 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో ఆయన 100 పరుగులు సాధించి పాక్ చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్నారు.
మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ (Pakistan) కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ జట్టు వైఫల్యాలను అంగీకరించారు. బ్యాటింగ్లో శుభారంభం లభించినప్పటికీ, తాము అనుకున్న విధంగా ఇన్నింగ్స్ను ముగించలేకపోయామని ఆయన తెలిపారు. తక్కువ స్కోరు చేయడం వల్ల విజయావకాశాలు తగ్గాయని, అదే సమయంలో హ్యారీ బ్రూక్ అసాధారణంగా బ్యాటింగ్ చేశారని కొనియాడారు. బ్రూక్ గ్రౌండ్ నలుమూలల షాట్లు ఆడగలరని, ఆయనను అడ్డుకోవడానికి తమ బౌలర్లు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.
ఈ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్న సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుతంగా రాణిస్తున్నాడని, అయితే మిగిలిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని కెప్టెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బౌలింగ్ విభాగంలో గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగడం పాక్ జట్టుకు సానుకూల అంశమని చెప్పారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీసి షాహీన్ తన మార్క్ చూపించాడని ప్రశంసించారు.
చివరి ఓవర్లలో నవాజ్ బౌలింగ్ చేసిన తీరు తమలో గెలుపు ఆశలు రేకెత్తించిందని అఘా తెలిపారు. విజయం సాధించడానికి ఒక్క శాతం అవకాశం ఉన్నా తమ జట్టు పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లండ్తో ఆడిన ప్రతిసారీ హ్యారీ బ్రూక్ తమకు సవాలుగా మారుతున్నాడని, ఆయన బ్యాటింగ్కు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదని కెప్టెన్ గౌరవంగా ముగించారు.

