కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ (CM Revanth Reddy) పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రేవంత్కు పాలన రావడం లేదని, ఐఎఎస్, ఐపీఎస్లను మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయని ఆరోపించారు. విభాగ అధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదని, విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలంలో ఐదుగురు అధికారులు మారారని హరీశ్ రావు గుర్తు చేశారు. విద్యుత్ శాఖలో అధికారుల మార్పు తీవ్ర ప్రభావం చూపిందని, ఈ బదిలీలతో విద్యుత్ శాఖ అవినీతి మయమైందన్నారు. అలాగే సింగరేణి, జీహెచ్ఎంసీ, ఐ అండ్ పీఆర్, విద్యాశాఖ పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఐటీశాఖ, మైనింగ్ శాఖ, నేషనల్ హెల్త్ మిషన్లో అనేక మంది మారారని హరీశ్ రావు మండిపడ్డారు.
‘‘140 మంది ఐఏఎస్ లను బదిలీ చేశారు. 20 మంది కలెక్టర్లను మార్చారు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారు. ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోంది. కలెక్టర్కు జిల్లాపై అవగాహనా రావడానికే ఆరునెలలు పడుతుంది. ఆరునెలలలోపే మార్చిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారు. కలెక్టర్లను ముఖ్యంగా యువ కలెక్టర్లను బదిలీ చేయడం వల్ల వారి నైతిక స్థయిర్యం దెబ్బ తింటోంది. వాళ్లకు నచ్చితే మంచి పోస్టింగ్స్.. లేకపోతే బదిలీలు. సీఎం, మంత్రులకు నచ్చకపోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదు. పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడగింపు సాధారణం అయిపోయింది” అని హరీశ్ రావు అన్నారు.

